Save democracy | ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడితే, దేశం ముప్పు ముంగిట నిలిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమె ఢిల్లీలో ఐదు రోజులు పర్యటించారు.
తన పర్యటన ముగించుకుని స్వరాష్ట్రానికి బయలుదేరి వెళుతూ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి రెండు నెలలకోసారి దేశ రాజధానికి వస్తానని మమతా బెనర్జీ చెప్పారు.
తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతోపాటు వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో మమతా బెనర్జీ సంప్రదింపులు జరిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్తో ఫోన్లో మాట్లాడారు. తాను ఈ రోజు శరద్ జీతోనూ మాట్లాడాను. ఆయన ముంబైకి వెళ్లారు. మళ్లీసారి వచ్చినప్పుడు కలుస్తాం అని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పలువురు విపక్ష నేతలతో సంప్రదించారు. తన ఢిల్లీ పర్యటన విజయవంతమైందని ప్రకటించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మమతా బెనర్జీ ఢిల్లీకి రావడం ఇదే మొదటిసారి.
నా సందర్శన విజయవంతమైంది. రాజకీయ కారణాలతో నేను పలువురు నా రాజకీయ సహచరులతో మాట్లాడాను. డెమోక్రసీని తప్పనిసరిగా కాపాడుకోవాలి.. సేవ్ డెమోక్రసీ.. సేవ్ కంట్రీ మా నినాదం.. ప్రతి రెండు నెలలకోసారి దేశ రాజధానికి వస్తా అని చెప్పారు.