న్యూఢిల్లీ : ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ను విచ్ఛిన్నం చేయాలని పాక్ కోరుకుంటోందని, 1971లోనే భారత భద్రతా బలగాలు ఈ ప్రణాళికలను విఫలం చేయశామని, ప్రస్తుతం ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 1971 యుద్ధంలో భారతదేశం సాధించిన 50 ఏళ్ల చారిత్రాత్మక విజయం, ఇండో-బంగ్లాదేశ్ స్నేహం జ్ఞాపకార్థం ఆదివారం ఇండియా గేట్ వద్ద జరిగిన ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’ వేడుకలను ఉద్దేశించి రక్షణ మంత్రి మాట్లాడారు.
మత ప్రాతిపదికన భారత్ను విభజించడం చారిత్రక తప్పిదమని ఈ యుద్ధం చెబుతోందని, పాక్ ఒక మతం పేరుతో పుట్టింది కానీ ఒక్కటిగా ఉండలేకపోయిందన్నారు. ‘ఈ విజయ్ పర్వ్ నిర్ధిష్ట ఆపరేషన్ మాత్రమే కాదు.. రాణి లక్ష్మీబాయి నుంచి మేజర్ సోమనాథ్ శర్మ, వీర్ అబ్దుల్ హమీద్, కెప్టెన్ విక్రమ్ బాత్రా వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్న దేశప్రజలు, మన సైన్యాల్లో విజయ స్ఫూర్తి స్థిరపడింది’ అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. రెండు ప్రపంచ యుద్ధాలను గుర్తు చేస్తూ.. ‘20వ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు ఎన్నో ఏళ్లుగా సాగాయి. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఇరవయ్యో శతాబ్దపు అత్యంత నిర్ణయాత్మకమైన యుద్ధాలను లెక్కిస్తే 1971లో జరిగిన యుద్ధమే.
ప్రపంచంలోని అత్యంత నిర్ణయాత్మక యుద్ధాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మన దేశంలా కాకుండా పాక్ తన క్షిపణులకు భారత్పై దాడి చేసిన ఆక్రమణదారుల పేర్లను ఎంచుకుంటున్నదని’ రాజ్నాథ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ పాక్లో భారత్ వ్యతిరేఖ భావన ఎంత బలంగా ఉందో.. భారత్పై దాడి చేసిన ఆక్రమణదారుల పేరుపై తమ క్షిపణులకు ఘోరీ, ఘజ్నవి, అబ్దాలీ పేరు పెట్టడాన్ని బట్టి అర్థమవుతుందన్నారు. భారతదేశం తన క్షిపణులకు ఆకాశ్, పృథ్వీ, అగ్ని అని పేరు పెట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు మన క్షిపణుల్లో ఒకదాన్ని సంత్ అని పేరు పెట్టారని, ఈ మిస్సైల్ పరీక్ష శనివారం విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఓను అభినందించారు.