న్యూఢిల్లీ : కోర్టు రూమ్లో ఒక మహిళ తన చేతిలోని విడాకుల పత్రాలను చింపేసి, గుండెల నిండా భావోద్వేగంతో అక్కడే ఉన్న తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతనిని కౌగలించుకోవడంతో ఆ జంట ఐదేండ్ల విడాకుల పోరాటం సుఖాంతమైంది. 2020లో వివాహ బంధంతో ఒక్కటైన శిఖ, సౌరభ్ల మధ్య కొద్ది కాలానికే విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో వీరిద్దరూ విడాకులకు సిద్ధపడి, కోర్టు మెట్లెక్కారు. కుమార్తెకు చట్టపరమైన మద్దతు అందించేందుకు శిఖ తండ్రి తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేశారు. అనుకోని విధంగా అతను గుండెపోటుకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న సౌరభ్ తన భార్యతో ఏర్పడిన వివాదాలను పక్కన పెట్టి, మానవత్వంతో ఆమె తండ్రిని ఒక ప్రైవేట్ దవాఖానలో చేర్పించి వైద్య సహాయం అందించారు. దీంతో ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్నారు. అయితే ఆ మర్నాడే శిఖ, సౌరభ్లు తమ విడాకుల కేసు కోసం కోర్టుకు హాజరు కావలసి వచ్చింది. విచారణ సందర్భంగా జడ్జి సౌరభ్తో ‘విడాకులు కావాలా?’ అని అడిగారు. అతను సమాధానం చెప్పేముందు భార్య శిఖవైపు చూసి చిన్నగా నవ్వాడు. అంతే ఆమె తన చేతిలోని విడాకుల పత్రాలను చింపేసి, పరుగుపరుగున భర్త దగ్గరకు వచ్చి కౌగలించుకుంది. దీంతో శిఖ, సౌరభ్లు కొంగొత్త ఆశలతో కొత్త జీవితానికి నాంది పలికారు.