భోపాల్: వివాహం జరిగిన తర్వాత భర్తతో శారీరక సంబంధానికి భార్య తిరస్కరించడం క్రూరత్వమే అవుతుందని, విడాకులు కోరడానికి ఇది చెల్లుబాటయ్యే కారణమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్య తనతో శారీరక సంబంధానికి తిరస్కరిస్తున్నారని, ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త భోపాల్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అయితే వీరికి విడాకులు మంజూరు చేయడానికి కోర్టు 2014 నవంబరులో తిరస్కరించింది. ఈ తీర్పును హైకోర్టు ఈ నెల 3న తోసిపుచ్చింది. వీరికి 2006 జూలై 12న వివాహం జరిగిందని, అదే నెల 28న భర్త విదేశాలకు వెళ్లారని, వివాహం జరిగిన తర్వాత, ఆయన విదేశాలకు వెళ్లడానికి మధ్యనున్న సమయంలో ఆమె శోభనానికి నిరాకరించారని హైకోర్టు గమనించింది. ఇది క్రూరత్వం కిందకే వస్తుందని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.