తిరువనంతపురం: కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్పై ప్రధాని మోదీ ఫొటో ఉంటే మీకు సిగ్గెందుకని పిటిషనర్ను కేరళ హైకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విశ్వసనీయతపై కోర్టు సోమవారం విచారణ జరిపింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోదీ చిత్రాన్ని ఉపయోగించడం వల్ల ‘అర్థం, ప్రయోజనం లేదా ఔచిత్యం లేదు’ అని ఆరోపిస్తూ కేరళకు చెందిన పీటర్ మైల్పరంబిల్ అక్టోబర్లో హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపారు. ‘వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై పీఎం మోదీ ఫోటోను ఉపయోగించడం, యూనివర్సిటీకి మాజీ ప్రధాని నెహ్రూ పేరు పెట్టడం మధ్య తేడా ఏమైనా ఉన్నదా’ అని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్లో పనిచేస్తున్న ఆ పిటిషనర్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘ఆయన (మోదీ) మన ప్రధాని, మరే ఇతర దేశానికి ప్రధాని కాదు. దేశ ప్రజలు ఎన్నుకోవడం ద్వారా ఆయన అధికారంలోకి వచ్చారు. మీకు రాజకీయ విభేదాలు ఉన్నందున, మీరు దీనిని సవాల్ చేయలేరు. మన ప్రధాని ఫొటో ఉంటే సిగ్గు ఎందుకు? వంద కోట్ల మంది ప్రజలకు లేని అభ్యంతరం, సమస్య మీకే ఎందుకు? మీరు న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నారు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కాగా, వ్యాక్సిన్ సర్టిఫికేట్ పిటిషనర్ వ్యక్తిగతమని, దానిపై ఆయనకు కొన్ని హక్కులుంటాయని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ డబ్బులు చెల్లించి టీకా తీసుకున్నందున, ప్రభుత్వం దానిపై క్రెడిట్ తీసుకోలేదని అన్నారు. ఇది పిటిషనర్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై మోడీ ఫోటోను ఉపయోగించాలని ప్రభుత్వం పట్టుబట్టినట్లయితే, ప్రధాని చిత్రం లేకుండా సర్టిఫికేట్లను జారీ చేసే అవకాశం కూడా ఉండాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇతర దేశాల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో ప్రభుత్వాధినేత చిత్రాలు లేవన్న సంగతిని గుర్తు చేశారు.
దీనిపై న్యాయమూర్తి కున్హికృష్ణన్ స్పందించారు. ‘వారు తమ ప్రధాని గురించి గర్వపడకపోవచ్చు. కానీ మనం గర్వపడతాం. ప్రజల ఆదేశం వల్లే ఆయన (మోదీ) ప్రధాని అయ్యారు. మనకు భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఇప్పటికీ ఆయనే మన ప్రధానమంత్రి’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు వ్యాక్సిన్ సర్టిఫికేట్పై మోదీ ఫొటో ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం తరుఫు న్యాయవాది సమర్థించారు. మోదీ ఫొటోతోపాటు ఆయన వ్యాఖ్యలు కూడా ఉన్నాయని, టీకా తీసుకోవడంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని కోర్టుకు తెలిపారు. టీకా డ్రైవ్పై అవగాహన కల్పించేందుకు మాత్రమే సర్టిఫికేట్పై మోదీ ఫొటో ఉంచిన విషయాన్ని ఆగస్ట్లో రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి సమాధానమిచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఈ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది.