న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతను ఉల్లంఘించి లోక్సభలోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకుల వద్ద ఉన్న పాస్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (Pratap Simha) జారీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఎంపీ ఎవరు? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కర్ణాటకలోని మైసూర్కు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సంతకం చేసిన పాస్లను పోలీసులు కనుగొన్నారు. బుధవారం లోక్సభలోకి దూకి అలజడి సృష్టించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి ఎంపీ ప్రతాప్ సింహా నియోజవర్గంతో సంబంధం ఉంటుందని అనుమానిస్తున్నారు. లోక్సభలో కలకలం సృష్టించిన ఆగంతకుల్లో ఒకడైన 35 ఏళ్ల డీ మనోరంజన్, బెంగళూరులోని మైసూర్ వివేకానంద విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా పోలీసులు గుర్తించారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సంతకంతో కూడిన విజిటర్ పాస్ను అతడితోపాటు మరో చొరబాటుదారుడైన సాగర్ శర్మ ఎలా పొందారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, 2014 లోక్సభ ఎన్నికల్లో మైసూర్ నియోజకవర్గం నుంచి ప్రతాప్ సింహా పోటీ చేశారు. 43.46 శాతం ఓట్లతో ఆయన గెలిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా 52.27 శాతం ఓట్ల మెజార్టీతో మరోసారి విజయం సాధించారు. 42 ఏళ్ల ప్రతాప్ సింహా, మాజీ జర్నలిస్ట్. ప్రతికల్లో కాలమిస్ట్గా ప్రసిద్ధి చెందారు. 2007లో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు. రైతు కొడుకైన తనకు ప్రధాని మోదీ ఆదర్శమని ఎంపీ ప్రతాప్ సింహా గతంలో పలుసార్లు అన్నారు.