బెంగళూరు: మోదీ వీరాభిమాని అయిన వ్యక్తి మూడోసారి ప్రధాని కావాలని ఆకాక్షించాడు. దీని కోసం కాళీ మాతకు రక్తాన్ని అర్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పొరపాటున వేలు నరుక్కున్నాడు. సగానికిపైగా తెగిన వేలిని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ ద్వారా అతికించడం కష్టమని తేల్చారు. (Man Accidentally Cuts Off Finger) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కార్వార్లోని సోనార్వాడలో నివసిస్తున్న అరుణ్ వెర్నేకర్, ప్రధాని మోదీ వీరాభిమాని. ఆభరణాల వ్యాపారి అయిన అతడు బీజేపీ మద్దతుదారుడు. తన ఇంట్లో మోదీ కోసం చిన్న గుడి కూడా కట్టాడు. మోదీ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్నాడు.
కాగా, మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని అరుణ్ ఆకాంక్షించాడు. ఈ నేపథ్యంలో మోదీ గుడిలోని కాళీ మాతా ఫొటోకు తన రక్తాన్ని అర్పించేందుకు ప్రయత్నించాడు. ఎడమ చేతి చూపుడు వేలును చాకుతో కోసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బలంగా కోసుకోవడంతో ఆ వేలు పైభాగం సగానికిపైగా తెగిపోయింది. కారిన రక్తంతో ‘కాళీ మాతా.. మా మోదీని రక్షించు’ అని రాశాడు.
మరోవైపు అరుణ్ చూపుడు వేలు తెగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. సగానికిపైగా తెగిన వేలును డాక్టర్లు పరిశీలించారు. సర్జరీ ద్వారా దానిని అతికించడం చాలా కష్టమని అన్నారు. వేలు పైభాగాన్ని పూర్తిగా తొలగించడమే మంచిదని సూచించారు. కాగా, వేలు తెగిన సంఘటనను అరుణ్ రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.