WhatsApp | న్యూఢిల్లీ, మార్చి 21: వాట్సాప్లో ఒక్కోసారి అత్యవసరంగా ‘వాయిస్’ రూపంలో సందేశాన్ని పంపుతాం. స్నేహితుడు లేదా ఆఫీస్లో పై అధికారికి అత్యవసరంగా ఓ వాయిస్ మెసేజ్ను పంపాల్సి వచ్చినప్పుడు, ఆ సందేశాన్ని చూసి.. దానిని ఓపెన్ చేయకపోతే, అందులోని విషయం తెలుసుకునే అవకాశం లేదు. దీనికి పరిష్కారంగా వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ వాయిస్ మెసేజ్ను.. టెక్ట్స్ ఫార్మాట్లోకి మార్చటం. ఈ ఫీచర్ తొలుత ‘ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టం’ ఉన్న యాపిల్ ఫోన్లలో ఇప్పటికే ప్రవేశపెట్టారు.
యాపిల్ ఫోన్లలో ఈ ఫీచర్ విజయవంతం కావటంతో, ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ తీసుకురావటంపై పరీక్షలు మొదలయ్యాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్ పరిచయం చేసేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నదని టెక్ వర్గాలు వెల్లడించాయి. టెక్స్ రూపంలో పరస్పర సందేశాలను ఇష్టపడే వ్యక్తులకు ప్రత్యామ్నాయ సమాచార మార్గంగా ఇది నిలుస్తుందని వాట్సాప్ వర్గాలు భావిస్తున్నాయి.