Diabetes | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, 29 మార్చి (నమస్తే తెలంగాణ): మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4 శాతం.. అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు. దేశ జనాభాలో 15.3 శాతం.. అంటే 13.6 కోట్ల మంది ప్రీడయాబెటిక్ దశలో ఉన్నారు. ప్రీడయాబెటిక్ దశలో ఉన్న వారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. వెంటనే అప్రమత్తమై జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మధుమేహం బారిన పడతారని లెక్క. అయితే, ప్రీడయాబెటిక్ స్టేజ్లో ఉన్న వారిని కచ్చితంగా గుర్తించడం ముఖ్యం. ఇందుకు గానూ వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష(1-hPG)ను ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్(ఐడీఎఫ్) సిఫారసు చేసింది. ఈ పరీక్ష ద్వారా అత్యంత కచ్చితత్వంతో ఎవరికి మధుమేహం ముప్పు ఉందో గుర్తించవచ్చని చెప్తున్నది. ఐడీఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా మధుమేహ సంఘాలతో కూడిన సంస్ధ. ఇది మధుమేహానికి సంబంధించి వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది.
సాధారణంగా ప్రీడయాబెటిక్ దశను 75 గ్రాముల నోటి గ్లూకోజ్ టాలరెన్స్(ఓజీటీటీ)లో రెండు గంటల ప్లాస్మా గ్లూకోజ్(2-h PG) పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. కానీ, కచ్చితమైన ఫలితం కోసం మధుమేహం ముప్పు ఉన్న వారు రాత్రిపూట ఉపవాసం ఉన్న తరువాత 75 గ్రాముల వన్ అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష(1-hPG) చేయించుకోవాలని ఐడీఎఫ్ చెప్తున్నది. 1-hPG విలువ 155 mg/dl కంటే ఎక్కువ ఉంటే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నట్టు పరిగణిస్తారు. 209 mg/dl లేదా అంత కంటే ఎక్కువ ఉంటే టైప్ 2 మధుమేహం ఉన్నట్టు లెక్క.