Bipin Rawath | తమిళనాడులోని కూనూర్ వద్ద సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే కుప్ప కూలిందా? ఇదే ప్రధాన కారణమా? అంటే అవుననే తెలుస్తోంది. వాతావరణం అంతగా అనుకూలంగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. సాంకేతిక సమస్యలు కారణం కాకపోవచ్చని, వాతావరణం సరిగ్గా లేని కారణంగా పైలట్ దారి విషయంలో తికమకపడి ఉండొచ్చన్నది దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అయితే దర్యాప్తు బృందం మాత్రం ఈ కారణం వల్లే ప్రమాదం జరిగిందని ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాలు మాత్రమే ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి.
మరోవైపు ఈ దుర్ఘటనలో మానవ తప్పిదం ఉందా? లేదా? అన్న విషయాలతో సహా అన్ని విషయాలనూ ఈ బృందం అతి క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో పైలట్ను తప్పుదోవ పట్టించారా? అన్న విషయాన్ని కూడా ఈ దర్యాప్తు బృందం పరిశీలించినట్లు చెబుతున్నారు. బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటనపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికైతే ఈ కమిటీ ఇంకా తన నివేదికను అధికారికంగా సమర్పించలేదు. అతి త్వరలోనే ఈ కమిటీ తన నివేదికను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి సమర్పించనుంది. ఈ హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా మరో 14 మంది ఆర్మీ సిబ్బంది దుర్మరణం పాలైన విషయం విదితమే.