లక్నో: సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ సోదాలు ముగిశాయి. దాదాపు వారం రోజుల తర్వాత తనిఖీలు ముగిసినట్లు అధికారులు చెప్పారు. అతని ఇంటి నుంచి 196 కోట్ల నగదు, 11 కోట్ల విలువైన 23 కేజీల బంగారం, 6 కోట్ల విలువైన 600 కేజీల గంధం నూనెను సీజ్ చేశారు. కాన్పూర్, కన్నౌజ్ నగరాల్లో ఆ సోదాలు సాగిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త పీయూష్ ఇంటి నుంచి టన్నుల కొద్దీ కరెన్సీ నోట్లను, పలు నోట్లు లెక్కించే మెషీన్లను సీజ్ చేశారు. అయితే ఈ ఘటనపై పీయూష్ జైన్ కుమారుడు మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులపై స్పందన కోరగా.. తాను చట్టాన్ని నమ్ముతానని, నిజం ఏంటో నిలకడగా తెలుస్తుందని తెలిపాడు. సోదాలను ముగించామని, స్వాధీనం చేసుకున్న బంగారాన్ని డీఆర్ఐకి అప్పగించామని, దర్యాప్తు కొనసాగుతోందని జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏడీజీ జకీర్ హుసేన్ తెలిపారు. జీఎస్టీ ఎగవేసిన కేసులో జైన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
గోల్డ్ బార్స్..
సుగంధ ద్రవ్యాల ముడి సరుకులను పీయూష్ జైన్ దుబాయ్కు ఎగుమతి చేసేవాడు. అయితే వాటికి బదులుగా బంగారు కడ్డీలు తీసుకునేవాడని విచారణలో తేలింది. పీయూష్ ఇంట్లో సీజ్ చేసిన బంగారంపై విదేశీ మార్కింగ్లు ఉన్నాయి. దిగుమతి సమయంలో అతను ఎలా కస్టమ్స్ డ్యూటీ నుంచి తప్పించుకునేవాడన్న కోణంలోనూ డీఆర్ఐ విచారణ కొనసాగిస్తోంది. పర్ఫ్యూమ్కు చెందిన ముడి ఉత్పత్తులను అతను సింగపూర్కు కూడా ఎక్స్పోర్ట్ చేసినట్లు విచారణలో తేల్చారు. డిసెంబర్ 22వ తేదీన కాన్పూర్లోని పీయూష్ ఇంట్లో ఐటీ సోదాలు ప్రారంభం అయ్యాయి. ఆ తనిఖీలు ఇవాళ ముగిసినట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ ఇంటి నుంచి విడుదలైన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. కరెన్సీ నోట్ల కట్టలు కుప్పలుకుప్పలుగా ఉన్న ఆ విజువల్స్ అందర్నీ స్టన్ చేశాయి. వ్యాపారి పీయూష్ జైన్ ఎలా ఇంత సొమ్మును పోగు చేశాడన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది.
ఏదైనా క్యాష్..
పీయూష్ జైన్తో పాటు ఆయన సోదరుడు అంబరీష్ జైన్లు సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేయడం తమ తండ్రి నుంచి నేర్చుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. అయితే పాన్మసాలా ఉత్పత్తిదారులకు తమ పర్ఫ్యూమ్లు అమ్మడం ద్వారా వారి వ్యాపారం మరింత పెరిగింది. అయితే ఈ ఇద్దరు వ్యాపారులు కేవలం నగదు రూపంలో మాత్రమే తమకు రావాల్సిన పేమెంట్స్ తీసుకునే వారు. ఆ కోణంలో విచారణ చేపట్టడం వల్లే దర్యాప్తు ఏజెన్సీలకు పీయూష్ సోదరులు చిక్కారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు తొలుత పాన్ మసాలా ఉత్పత్తిదారుల్ని ట్రాప్ చేశారు. ఆ తర్వాత వారి నుంచి జైన్ ఆచూకీ రాబట్టారు. కేవలం స్కూటర్ మీద తిరిగి.. సాదాసీదాగా ఉండే జైన్ వద్ద ఇంత డబ్బు ఉందా అని ఇప్పుడు అక్కడి జనం అశ్చర్యపోతున్నారు.