ఇండోర్, మార్చి 23: సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే వివాహితగా తెలుస్తుందని మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నది. ఇండోర్కు చెందిన దంపతులకు 2017లో వివాహం జరిగింది. వారికి ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఐదేండ్ల క్రితం తన భార్య తనను వదిలి వెళ్లిందని, ఆమె మళ్లీ తనతో కలిసి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని భర్త కోర్టుకెక్కాడు.
ఈ పిటిషన్ను విచారించిన ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎన్పీ సింగ్.. ‘మహిళ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సింధూరం పెట్టుకోవడం లేదని చెప్పింది. సింధూరం పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత. భర్త ఆమెను విడిచిపెట్టలేదు. ఆమే భర్తను విడిచిపెట్టింది. తన భర్త కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించినప్పటికీ ఇందుకు ఆధారాలు లేవు. పోలీసులకు ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, మహిళ వెంటనే తన భర్త ఇంటికి తిరిగి వెళ్లాలి’ అని తీర్పు చెప్పారు.