పనాజి: దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ కుమారుడు, ఉత్పల్ పారికర్తో ఎలాంటి రహస్య సమావేశం జరుగలేదని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉత్పల్ పారికర్కు స్పష్టమైన, స్వచ్ఛమైన మనస్సుతో మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పనాజిలో శనివారం మీడియాతో ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. రాబోయే కాలంలో గోవాలో జరిగే అన్ని ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని తెలిపారు. లోక్సభ ఎన్నికలు అయినా, విధానసభ ఎన్నికలు అయినా లేదా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినా సరే తాము పోటీ చేస్తామని అన్నారు.
కాగా, ప్రస్తుత దేశ రాజకీయాల దృష్ట్యా అన్ని రాష్ట్రాల్లో శివసేన అవసరం ఉందని ఆదిత్య ఠాక్రే తెలిపారు. మహారాష్ట్రలోని సుపరిపాలన అన్ని రాష్ట్రాల్లోనూ పునరావృతం కావాలన్నారు. ఇది తమ ఆకాంక్ష అని అన్నారు. అందుకే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తున్నదని చెప్పారు.
మరోవైపు ఇప్పటి వరకు మహారాష్ట్రకే పరిమితమైన శివసేన తొలిసారి ఆ రాష్ట్రం వెలుపల ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నది. అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నది.