Unity March in Delhi | దేశ రాజధాని హస్తినలోని జహంగీర్పురి బ్లాక్లో ఆదివారం హిందువులు, ముస్లింలు కలిసి తిరంగ యాత్ర పేరుతో శాంతి ప్రదర్శన జరిపారు. ఈ నెల 16న జహంగీర్పురిలో ఘర్షణలు జరిగాయి. ఈ ప్రాంతంలో శాంతి సామరస్యతలను కాపాడాలన్న సందేశంతో ఢిల్లీ వాసులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఢిల్లీ పోలీసుల సహకారంతో ఈ ప్రదర్శన జరిగింది. ఇందుకోసం ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇరు పక్షాలకు చెందిన 50 మందిని ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.
త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ భారత్ మాతాకీ జై, వందేమాతరం అన్న నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది. ఈ ప్రదర్శనను సీ బ్లాక్ వాసులు తమ ఇండ్ల ముందు వీధుల్లో నిలబడి మరీ వీక్షించారు. మరి కొందరు కిటికీల వద్ద నుంచి, బాల్కానీల నుంచి గమనించారు. శాంతి ప్రదర్శనలో పాల్గొన్న వారిపై ప్రేక్షకులు పూల వర్షం కురిపించారు. త్రివర్ణ పతాకాలు ప్రదర్శించారు.