Acharya Vidhyasagar Ji: జైనమత గురువు, నగ్న ముని అచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ ఇకలేరు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం డొంగార్గఢ్లోని చంద్రగిరి తీర్థంలో మూడు రోజుల క్రితం సజీవ సమాధి అయిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు తన దేహాన్ని విడిచి వెళ్లారు. సజీవ సమాధిలోకి వెళ్లినప్పటి నుంచి దేహాన్ని విడిచే వరకు ఆయన నిరంతరాయ నిశ్శబ్దాన్ని పాటించారు. ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ మరణవార్త ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో జైనమతానికి చెందిన ప్రజలు తండోపతండాలు ఆయన సమాధిని దర్శించుకునేందుకు తరలివెళ్తున్నారు.
విద్యాసాగర్ మహరాజ్ గురువు జ్ఞాన్ సాగర్ మహరాజ్ కూడా తన 77వ ఏట చంద్రగిరి తీర్థంలోనే సజీవంగా సమాధిలోకి వెళ్లి మూడు రోజులకు దేహాన్ని విడిచారు. సజీవ సమాధికి మూడు రోజుల ముందే విద్యాసాగర్ మహరాజ్కు జ్ఞాన్ సాగర్ మహరాజ్ జైనమత గురువు స్థానాన్ని కట్టబెట్టారు. అప్పటికి విద్యాసాగర్ మహరాజ్ వయసు 26 ఏండ్లు. ఇప్పుడు విద్యాసాగర్ మహారాజ్ కూడా సజీవ సమాధికి ముందు తన శిష్యుల్లోంచి ఒకరిని తదుపరి ఆచార్యగా ప్రకటించారు. నిర్యాపక శ్రామన్ ముని సమయ్సాగర్కు ఆచార్య హోదాను కట్టబెట్టారు.
కాగా, గత ఏడాది నవంబర్ 5న భారత ప్రధాని నరేంద్రమోదీ విద్యాసాగర్ మహరాజ్ను దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యాసాగర్ మహరాజ్ 1946 అక్టోబర్ 10న కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లాలోని సదల్గా గ్రామంలో జన్మించారు. ఆయన తోడ ముగ్గురు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. అందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే గడిపారు. దాదాపు 500 మందికి పైగా ఆయన దగ్గర శిష్యరికం చేశారు. కాగా, విద్యాసాగర్ మహరాజ్ మరణవార్త తెలియగానే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సోషల్ మీడియా ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.