నోయిడా: అది బాగా రద్దీ ప్రాంతంలోని రోడ్డు. ఆ రోడ్డులో ఒకవైపు మాత్రమే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఎందుకంటే జగన్నాథ స్వామి శోభాయాత్ర కోసం మరోవైపు వచ్చే వాహనాలను దారిమళ్లించారు. అంగరంగవైభవంగా శోభాయాత్ర కొనసాగుతున్నది. యాత్రకు సంబంధించిన సామాగ్రితో ముందు నడుస్తున్న ఈ-రిక్షా ఒకటి ఓ దుకాణం ముందు ఆగింది. అక్కడ ఆగిన కాసేపటికే ఆ రిక్షా ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న జనం షాకయ్యారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
కానీ, కాసేపటికి అందరూ షాక్ నుంచి తేరుకున్నారు. ఈ-రిక్షాలో ఉన్న టపాసులకు నిప్పంటుకుని పేలిపోయాయని గ్రహించారు. వెంటనే నీళ్ల బకెట్లు, ఆక్సిజన్ సిలిండర్లతో మంటలను ఆర్పేశారు. అయితే ఈ పేలుడులో ఈ-రిక్షా డ్రైవర్, టపాసులు కాలుస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫైర్ క్రాకర్స్ కాల్చే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని దాద్రి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగన్నాథుని శోభాయాత్రను ఘనంగా నిర్వహించడం కోసం నిర్వాహకులు భారీగా పటాసులు తెప్పించారని, ఆ పటాసులను ఓ ఈ-రిక్షాలో పెట్టుకుని ఒక్కో ప్యాకెట్ తీసి కాలుస్తూ ముందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలో కాల్చిన పటాసులకు సంబంధించిన నిప్పురవ్వలు ఈ-రిక్షాలోని క్రాకర్స్ కాటన్లపై పడటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడు ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఈ ఎలక్ట్రిక్ రిక్షా పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కింది వీడియోలో ఆ పేలుడు దృశ్యాలను మీరూ ఒకసారి వీక్షించండి..
On Camera, E-Rickshaw Blows Up During Firecracker Drop In Noida, 1 Dead https://t.co/Wqt68GEWHa pic.twitter.com/pMAVPKdKjP
— NDTV (@ndtv) February 28, 2023