చెన్నై/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎల్సీ విక్టోరియా గౌరి ప్రమాణస్వీకారం నేపథ్యంలో హైడ్రామా చోటుచేసుకొన్నది. ఓ వైపు ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేస్తున్న సమయంలోనే.. ఇటు ఆమె ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. కాగా, విక్టోరియా గౌరికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
‘అర్హతలను సవాల్ చేయవచ్చు కానీ రాజకీయ అనుకూలతల విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు. రాజకీయ నేపథ్యంలో ఉన్నవారు కూడా గతంలో న్యాయమూర్తులు అయ్యారు’ అని పేర్కొన్నది. మరోవైపు జడ్జిగా గౌరి నియామకాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం మద్రాస్ హైకోర్టు సమీపంలో ఆందోళన చేపట్టింది. విక్టోరియా గౌరికి బీజేపీ నేపథ్యం ఉన్నదని, ఆమె గతంలో ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.