Varun Gandhi | బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోమారు సొంత పార్టీపై విమర్శలకు దిగారు. ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించిన వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించడం ఏమిటని ట్వీట్ చేశారు. ప్రభుత్వశాఖల్లో ఒకవేళ ఖాళీలు ఉంటే, నియామకాలు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగినప్పటి నుంచి సొంత పార్టీపైనే వరుణ్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న నిరసనకారులను పోలీసులు వెంటాడి లాఠీలు ఝుళిపించిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
ఆందోళనకారులంతా భారతీయులేనని, వారి విజ్ఞప్తులను వినేందుకు కూడా ఏ ఒక్కరూ లేరని వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నిరసన ప్రదర్శనల్లో అధికారుల పిల్లలు ఉంటే ఇలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. తాజా వరుణ్గాంధీ ట్వీట్తో పార్టీ విధానాన్ని పాటించేందుకు సిద్ధంగా లేరని అర్థం అవుతున్నది.