Varun Gandhi | పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీకి రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించింది. పిలిభిత్ ప్రజలను ఉద్దేశించి వరుణ్ గాంధీ లేఖ రాశారు. ఫిలిబిత్తో తన సంబంధం రాజకీయాలకు అతీతమైందని, పిలిభిత్ బిడ్డనైన తాను ప్రజల కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించేందుకూ సిద్ధమని ప్రకటించారు.
సామాన్యుడి గొంతు వినిపించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచేఉంటాయని స్పష్టం చేశారు. ఇవాళ తాను ప్రజల కోసం చేసే పనులను కొనసాగించేందుకు వారి ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు. 1983లో మూడేండ్ల వయసులో తాను తల్లి వేలు పట్టుకుని పిలిభిత్ గడ్డపై అడుగుపెట్టానని, ఇప్పుడు ఇదే తన కార్యస్ధలమైందని, ఇక్కడి ప్రజలు తన కుటుంబంలో భాగమయ్యారని, ఈ విషయాలన్నీ తనకు గుర్తుకువస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
మీ ప్రతినిధిగా లోక్సభ కు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో పొందిన అత్యున్నత గౌరవమని అన్నారు. ఎంపీగా తన పదవీ కాలం ముగియనున్నా, పిలిభిత్ ప్రజలతో తన అనుబంధం తుదిశ్వాస వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎంపీగా కాకున్నా ఈ ప్రాంత ప్రజల కోసం తాను జీవితాంతం పనిచేస్తూనే ఉంటానని, మీ కోసం తన ఇంటి తలుపులు గతంలో మాదిరిగా ఎప్పుడూ తెరిచేఉంటాయని అన్నారు. కాగా, ఐదో జాబితాలో బీజేపీ పిలిభిత్ నుంచి జితిన్ ప్రసాదకు టికెట్ కేటాయిస్తూ వరుణ్ గాంధీని పక్కనపెట్టింది. మరవైపు వరుణ్ గాంధీని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ నేత అహిర్ రంజన్ చౌధరి సిట్టింగ్ ఎంపీని స్వాగతించారు.
Read More :
Dilip Ghosh | దీదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్పై కేసు నమోదు