లక్నో: జ్ఞానవాపీ (Gyanvapi Case)కేసులో హిందూ పిటీషనర్లకు ఎదురుదెబ్బ తగిలింది. మసీదులో ఉన్న శివ లింగంపై కార్బన్ డేటింగ్ చేయాలన్న పిటీషనర్ల అభ్యర్థనను వారణాసి కోర్టు కొట్టిపారేసింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో సర్వే నిర్వహించాలని నాలుగు హిందూ గ్రూపులు కోర్టులో పిటిషన్ వేశారు. జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహిస్తున్న సమయంలో శివ లింగం బయటపడిన విషయం తెలిసిందే. అయితే అది శివ లింగమా లేక ఫౌంటేనా తేల్చేందుకు శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని వేసిన పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది.
ఈ కేసులో జిల్లా జడ్జి డాక్టర్ ఏకే విశ్వేషా తీర్పును వెలువరించారు. జ్ఞానవాపీ మసీదులో శివలింగం దొరికిన ప్రదేశాన్ని సీల్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విచారణ సందర్భంగా జడ్జి గుర్తు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎటువంటి శాస్త్రీయ విచారణకు అనుమతి ఇవ్వలేమని జడ్జి విశ్వేష తీర్పునిచ్చారు.
హిందూ ఆరాధకులు వేసిన పిటిషన్పై అంజుమన్ ఇంతజామియా మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మసీదు కన్నా ముందు నుంచే ఆ ప్రాంతంలో శివలింగం ఉండేదని, ఆ లింగాన్ని స్థానికులు ఆరాధించేవాళ్లు అని హిందువులు తమ పిటిషన్లో వాదించారు. శివారాధకుల కోసం ఆ లింగం ఎప్పటిదో తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ చేయాలంటూ పిటిషనర్లు కోరారు.