న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న, రెండో దశ ఫిబ్రవరి 14న, మూడో దశ ఫిబ్రవరి 20న, నాలుగో దశ ఫిబ్రవరి 23న, ఐదో దశ ఫిబ్రవరి 27న, ఆరో దశ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరుగనుంది. అంటే ఫిబ్రవరి 10 మొదలు మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానున్నాయి.
మొదటి దశ పోలింగ్ కోసం జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలు గడువు జనవరి 21 వరకు ఉంటుంది. జనవరి 24న స్క్రూటినీ నిర్వహిస్తారు. జనవరి 27 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఏడో దశ పోలింగ్ కోసం ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ వెల్లడించనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 17 తుది గడువు. ఫిబ్రవరి 18న స్క్రూటినీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.