హరిద్వార్ : ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ 51 ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి సహా పలు ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దిశగా గత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీసుకున్న నిర్ణయాన్ని నూతన సీఎం తిరగదోడారు.
చార్ధామ్ దేవస్ధానం బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని సమీక్షిస్తామని, 51కిపైగా ప్రముఖ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదని సీఎం రావత్ స్పష్టం చేశారు. ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీ, ప్రముఖ గుడులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆయా ఆలయాలు సమర్ధంగా నిర్వహించేలా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్లోకి వెళ్లేందుకు వెసులుబాటు లభించిందని సీఎం రావత్ పేర్కొన్నారు.