లక్నో: ఉత్తరప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి ( Mayavati ) మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు. యూపీలో శాంతిభధ్రతలు, ఆరోగ్య వ్యవస్థ మాదిరిగానే రోడ్లు కూడా అధ్వాన్నంగా తయారయ్యాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇది యూపీలో బీజేపీ సర్కారు వైఫల్యం అని మండిపడ్డారు. గతుకుల మయమైన రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ట్వీట్ చేశారు.
ఈ మధ్య కాలంలో భారీగా వర్షాలు పడటంతో పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిందని, దాంతో గతుకులమయంగా మారిన రోడ్లపై ఎక్కడ గుంత ఉందో కనపడక వాహనదారులు ఇబ్బందులు పడుతారని మయావతి విమర్శించారు. రోడ్లపై గుంతల కారణంగా ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, పత్రికలు ఎక్కువగా రోడ్డు ప్రమాద వార్తలతో నిండిపోతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై రోడ్లను బాగుచేయించాలని మాయావతి సూచించారు.