లక్నో: బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. (BJP MLA Disqualified) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. తొమ్మిదేళ్ల కిందట బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ను ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 15న శిక్షలు ఖరారు చేసింది. 25 ఏళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు పది లక్షల జరిమానా విధించింది.
కాగా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించిన చట్టసభ సభ్యుడ్ని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలో బాలికపై అత్యాచారం కేసులో 25 ఏళ్లు జైలు శిక్ష పడిన బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ను అనర్హుడిగా ప్రకటించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లో వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలిన పలువురు శాసనసభ్యులపై కూడా అనర్హత వేటు పడింది. 2022 అక్టోబర్లో సమాజ్వాదీ పార్టీ (రాంపూర్ సదర్ సీటు) ఎమ్మెల్యే ఆజం ఖాన్, బీజేపీకి చెందిన విక్రమ్ సింగ్ సైనీ (ఖటౌలీ ఎమ్మెల్యే) అనర్హులయ్యారు. 2019లో నమోదైన ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆజం ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష, 2013లో జరిగిన ముజఫర్నగర్ అల్లర్ల కేసులో సైనీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో వారిపై అనర్హత వేటు పడింది. ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2020 ఫిబ్రవరిలో అసెంబ్లీకి అనర్హుడయ్యారు. అయితే దీనికి ముందే ఆయనను ఆ పార్టీ బహిష్కరించింది.