అమ్రోహ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండ్రి, ఇతర కుటుంబసభ్యులతో గొడపడి కోపంగా బయటికి వెళ్లిన ఓ వ్యక్తి కారుతో సహా నదిలోకి దూసుకెళ్లాడు. నీళ్లలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అతని భార్య గల్లంతైంది. ఆమె ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. అమ్రోహ జిల్లాకు చెందిన షాన్ ఎ ఆలమ్ శుక్రవారం సాయంత్రం తన తండ్రితోపాటు ఇతర కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. గొడవ అనంతరం తన భార్యను తీసుకుని ఇంటి నుంచి ఆవేశంగా కారులో బయలుదేరాడు. తన తండ్రి, సోదరి కారుకు అడ్డం రావడంతో వారిని ఢీకొట్టి మరీ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆలమ్ తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తండ్రిని ఢీకొట్టిన అనంతరం ఆదే ఆవేశంలో కారు నడిపిన షాన ఎ ఆలమ్.. భార్యతో సహా రోడ్డు వెంట ఉన్న నదిలో దూసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సెర్చింగ్ కోసం రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించారు. శనివారం ఉదయం షాన్ ఎ ఆలమ్ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన అతని భార్య మృతదేహం కోసం సెర్చింగ్ కొనసాగుతున్నది.