న్యూఢిల్లీ : పనాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ మంచి అభ్యర్ధిని నిలబెడితే తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకునేందుకు సిద్ధమని గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పేర్కొన్నారు. బీజేపీ టికెట్ దక్కకపోవడంతో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు పారికర్ సిద్ధమయ్యారు. కాషాయ పార్టీని వీడటం సంక్లిష్ట నిర్ణయంగా ఉత్పల్ పారికర్ చెప్పారు.
రెండు దశాబ్ధాలుగా పనాజీ నుంచి పారికర్ తండ్రి మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించారు. మనోహర్ పారికర్ మరణంతో పనాజీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన అటనసియో మన్సరటెకు తాజాగా బీజేపీ టికెట్ కేటాయించింది. మన్సరటెపై మైనర్ బాలికపై లైంగిక దాడి సహా పలు క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ ఎన్నటికీ తన హృదయంలో ఉంటుందని పార్టీ కోసం తాను పోరాడతానని ఉత్పల్ పారికర్ చెప్పుకొచ్చారు.
పనాజీ నుంచి తనకు టికెట్ నిరాకరించడాన్ని 1994లో తన తండ్రిని పార్టీ నుంచి బయటకు పంపేందుకు జరిగిన ప్రయత్నాలతో పోల్చారు. ప్రజాబలం వెన్నంటి ఉండటంతో తన తండ్రిని అప్పట్లో ఏమీ చేయలేకపోయారని చెప్పారు. తన తండ్రికి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఇప్పటికీ బీజేపీలో ఉన్నత స్ధానాల్లో ఉన్నారని అన్నారు. 2019లో ప్రజల మద్దతు తనకు ఉన్నప్పటికీ పనాజీ ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకు నిరాకరించారని చెప్పారు. అప్పట్లో పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించానని ఉత్పల్ పారికర్ గుర్తుచేశారు.