టొరంటో: నిద్ర లేవగానే వాట్సాప్ ఓపెన్ చేస్తాం. మెసేజులు, వీడియోలు పంపుతాం. ఫేస్బుక్ ఓపెన్ చేసి పోస్టులు పెడతాం. ట్విట్టర్ ఓపెన్ చేసి ఓ మెసేజ్ పడేస్తాం.. ఒకవేళ మనం అకౌంట్ వాడకుండా అలా చాలాకాలం వదిలేస్తే? మన అకౌంట్ ఉన్న కంపెనీయే మూతపడితే? అప్పటివరకూ ఉన్న మన డాటా ఏమవుతుంది? ఎక్కడికి పోతుంది? ఎవరు భద్రపరుస్తారు? ఇలాంటి విషయాలను నూటికి 90 మంది పట్టించుకోరు. కానీ, మన డాటాతో తెరవెనుక చాలా తతంగం నడుస్తున్నదని పలు పరిశోధనలు తేల్చాయి. టొరంటో యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టోరల్ ఫెలో కటీ మ్యాకిన్నన్ ఈ అంశంపైనే లోతుగా పరిశోధన నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కంపెనీ మూతపడితే ఉద్యోగులదే నిర్ణయం
ఇప్పుడంటే ఫేస్బుక్, ట్విట్టర్లాంటి పెద్దపెద్ద కంపెనీలు ఉన్నాయి 1990, 2000 ప్రాంతంలో అప్పుడే పురివిప్పుతున్న డిజిటల్ ప్రపంచంలో అనామక కంపెనీలే ఎక్కువ. జియోసిటీస్, నెక్సోపియా, లైవ్జర్నల్, మైస్పేస్ వంటి వాటిని యూజర్లు విరివిగా వాడేవారు. తర్వాతికాలంలో పోటీని తట్టుకోలేక ఇవి కనుమరుగయ్యాయి. మరి వాటి యూజర్ల డాటా ఏమైనట్టు? ఈ అంశంపై మ్యాకిన్నన్ లోతుగా పరిశోధించగా, ఆ కంపెనీలు మూత పడిన తర్వాత అందులోని డాటాను అక్కడ పనిచేసిన ఉద్యోగులే తీసుకెళ్లినట్టు తేలింది. చాలావరకు డాటాను వివిధ సంస్థలు తమ పరిశోధనల కోసం ఉపయోగించుకొన్నాయని గుర్తించారు. అంటే యూజర్ అనుమతి లేకుండానే వ్యక్తిగత వివరాలు, సకల సమాచారం ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నదన్నమాట.
యూరప్లో కాస్త మెరుగు
వాడుకలో లేని అకౌంట్ల డాటా, మూతపడిన కంపెనీల వద్ద ఉన్న డాటా నిర్వహణకు సంబంధించి యూరప్లో కాస్త మెరుగైన విధానం ఉన్నది. ఈయూ జనరల్ డాటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టాన్ని తెచ్చింది.