వాషింగ్టన్: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవేపై (Kevin Dave) నేరాభియోగాలు మోపడంలేదని అధికారులు వెల్లడించారు. సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపింది. కాగా, జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్.. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలిపారు. ఈ నేపథ్యంలో అడెరెర్పై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యల ప్రభావం డవేపై అభియోగాలు మోపొద్దనే నిర్ణయంపై ఉండబోదని వివరించారు. అయితే, అడెరెర్ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా అవి ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే అతనిపై సస్పెన్షన్ వేటుపడ్డ విషయం తెలిసిందే. అతనిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి తుది విచారణ మార్చి 4న జరుగనుంది.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి అమెరికాలోని సౌత్ లేక్ యూనివర్సిటీలోని నార్త్ఈస్టర్న్ వర్సిటీ సీటల్ క్యాపస్లో మాస్టర్స్ చదువుతున్నది. అయితే గతేడాది జనవరిలో సియాటెల్లో రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. దీంతో గాల్లో ఎగిరి రోడ్డుపై పడిన ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్.. చులకనగా, ఎగతాళిగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు. 11 వేల డాలర్లకు ఒక చెక్ రాయండి’ అన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది ఫోన్లో మాట్లాడిన ఈ సంభాషణ ఆ పోలీస్ అధికారి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. దీంతో అతణ్ని సస్పెండ్ చేశారు. అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.