జలావున్, అక్టోబర్ 21: అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలతో ఓవైపు సామాన్యుడు లబోదిబోమంటుంటే.. మరోవైపు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు మాత్రం ఇంధన బాదుడును సమర్థించుకునేందుకు వింత కారణాలను చెబుతున్నారు. ‘ఉచితంగా టీకా వేయట్లేదా? అందుకే ఇంధన ధరలను పెంచుతున్నాం’ అని ఇటీవల కేంద్రమంత్రి రామేశ్వర్ తెలి వ్యాఖ్యానించగా, తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దేశంలో 95% మందికి పెట్రోల్ అవసరమే లేదని యూపీ మంత్రి ఉపేంద్ర తివారీ అన్నారు. పెట్రోల్ రేట్ల పెరుగుదలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘దేశంలో చాలా తక్కువ మంది కార్లు వాడుతున్నారు. వారికే పెట్రోల్ అవసరం. 95% మందికి పెట్రోల్ అవసరమే లేదు’ అని అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పుకొచ్చారు. ‘పెరిగిన తలసరి ఆదాయంతో పోల్చితే పెట్రోల్ రేట్లలో పెరుగుదల చాలా తక్కువ’ అని వ్యాఖ్యానించారు. ఇంధన ధరలకు, కరోనా టీకాలకు ముడిపెట్టారు. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయనేవారు ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
మళ్లీ పెట్రో మంట
పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు చొప్పున పెంపు
ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఇంధన ధరలు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.106.54కు చేరగా.. ముంబైలో రూ.112.44కు ఎగబాకింది. అలాగే లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.95.27కు పెరుగగా.. ముంబైలో రూ.103.26కు చేరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ ధర ఎప్పుడో రూ.100 దాటగా.. తాజాగా శ్రీనగర్ నుంచి చెన్నై వరకు లీటరు డీజిల్ ధర రూ.99పైనే ఉన్నది. దేశంలోనే అత్యధికంగా లీటరు పెట్రోల్ ధర రాజస్థాన్లోని గంగానగర్ పట్టణంలో రూ.118.59 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.109.41గా ఉన్నది.