కోల్కతా: ఎండు సముద్ర గుర్రాల అక్రమ తరలింపు కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. ఈ నెల 25న ఐదు కిలోల ఎండు సముద్ర గుర్రాలను తరలిస్తూ సిలిగురి జిల్లాలోని నక్సల్బరిలో ఫయాజ్ అహ్మద్ అనే నిందితుడు పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేసిన బెంగాల్ పోలీసులు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టారు.
తనతోపాటు మరో నలుగురికి కూడా ఎండు సముద్ర గుర్రాల అక్రమ తరలింపు దందాలో భాగస్వామ్యం ఉందని ఫయాజ్ అహ్మద్.. పోలీసుల ఇంటరాగేషన్లో ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు జీవన్ తాపా, సుజిత్ తమాంగ్, కంకన్ రాహా అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి మరో 8.5 కిలోల ఎండు సముద్ర గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న మరోజ్ రాయ్ అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. సముద్ర గుర్రాలు అంటే ఒక రకం చేపలు. వీటి ముఖాలు గుర్రాల ముఖాలను పోలి ఉండటంతో ఈ చేపలను సముద్రపు గుర్రాలు అంటారు. ఈ సముద్రపు గుర్రాల తరలింపుపై పశ్చిమబెంగాల్లో నిషేధం ఉంది. వాటిని అక్రమంగా తరలించే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు.