లక్నో: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ సన్నద్ధతలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి మాయవతి అధ్యక్షురాలిగా ఉన్న బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) ఈ నెల 23న బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయవతే స్వయంగా ప్రకటించారు.
ఆదివారం లక్నోలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాయావతి.. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ ఈ నెల 23న అయోధ్యలో బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించనున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులెవరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయరని ఆశిస్తున్నా అన్నారు. అదేవిధంగా బీఎస్పీ పాలనలో మాత్రమే బ్రాహ్మణుల ప్రయోజనాలు కాపాడబడుతాయని బరోసానిచ్చేలా ఈ నెల 23న అయోధ్య నుంచి ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టనున్నట్లు మాయవతి తెలిపింది.
బీఎస్పీ జనరల్ సెక్రెటరీ ఎస్సీ మిశ్రా నాయకత్వంలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగనున్నది. అదేవిధంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై మాయవతి మాట్లాడుతూ.. ఉభయసభల్లో తమ పార్టీ ఎంపీలు ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను లేవనెత్తుతారని చెప్పారు. దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా ఇందుకు సహకరించాలని ఆమె కోరారు.