లక్నో: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలతోపాటు దేశ రాజకీయాల్లో మార్పునకు దారి తీసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. దీంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలపై దూరదర్శన్, ఆకాశవాణిలో రాజకీయ పార్టీల ప్రచారం కోసం మొత్తం 1,798 నిమిషాలు కేటాయించారు. రాజకీయ పార్టీలకు ప్రసార సమయం నిర్ణయించేందుకు శుక్రవారం డ్రా తీసినట్లు యూపీ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ బ్రహ్మ్ దేవ్ రామ్ తివారీ తెలిపారు.
దూరదర్శన్, ఆకాశవాణిలో ఎన్నికల ప్రచార ప్రసారానికి సంబంధించి బీజేపీకి 478, బీఎస్పీకి 307, ఎస్పీకి 303, కాంగ్రెస్కు 151, ఆర్ ఎల్డీకి 107, సీపీఐకి 92, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, ఎన్పీపీకి 90 నిమిషాల చొప్పున సమయం కేటాయించినట్లు బ్రహ్మ్ దేవ్ రామ్ తివారీ వెల్లడించారు. మొత్తం 7 దశలను కవర్ చేస్తూ ఫిబ్రవరి 5 నుండి మార్చి 5 వరకు మొత్తం 16 రోజులు మధ్యాహ్నం 1-3 మధ్య దూరదర్శన్లో ప్రసారం జరుగుతుందని వివరించారు.
అదేవిధంగా ఆకాశవాణిలో 14 రోజులపాటు ప్రసారం జరుగుతుందని తివారీ తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 10 నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి 7:10 వరకు రెండు షిఫ్టులలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రసారాలు ఉంటాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు కలిపి దూరదర్శన్, రేడియోలో ఎన్నికల ప్రచార ప్రసారాలకు మొత్తం 1,798 నిమిషాలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.