చత్తీస్గఢ్ పోలీసులకు యూపీ ఖాకీల అడ్డగింత
రహస్య ప్రాంతానికి టీవీ యాంకర్ తరలింపు
రాహుల్పై నకిలీ వీడియో కేసులో హైడ్రామా
ఘాజియాబాద్/రాయ్పూర్, జూలై 5: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నకిలీ వీడియో ప్రసారం కేసులో ఓ టీవీ చానెల్ జర్నలిస్టు రోహిత్ రంజన్ అరెస్టు వ్యవహారం ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మంగళవారం ఘజియాబాద్లో హైడ్రామా నడిచింది. యూపీ పోలీసులు బీజేపీ కార్యకర్తల్లా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోదీపై ట్విట్టర్లో అభ్యంతకర పోస్టు పెట్టారని ఆరోపిస్తూ బీజేపీ పాలిత అస్సాం పోలీసులు గుజరాత్ వెళ్లి మరీ అర్థరాత్రి ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అరెస్టు చేస్తే.. అదే బీజేపీ పాలిత యూపీ పోలీసులు వారెంట్ సహా జర్నలిస్టును అరెస్టు చేసేందుకు ఛత్తీస్గఢ్ పోలీసులు వస్తే వారిని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు.
తమ వద్ద నమోదైన కేసులో విచారణకంటూ నోయిడా పోలీసులు అతన్ని రహస్య ప్రాంతానికి తరలించారు. కేరళలోని వయనాడ్లో తన కార్యాలయంపై దాడి చేసిన వారిని చిన్నపిల్లలతో పోలుస్తూ.. వారిపై తనకు దురుద్దేశం లేదని రాహుల్ పేర్కొన్నారు. అయితే ఉదయ్పూర్ హత్య నిందితులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియోను వక్రీకరించి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ ఫిర్యాదు మేరకు రాయ్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.