లక్నో: ఇకపై లిఫ్ట్ ఏర్పాటు చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మరమ్మతులు చేయడంలో విఫలమైతే, ప్రమాణాలను విస్మరిస్తే యజమాని లేదా సంబంధిత సంస్థకు జరిమానా విధిస్తారు. లిఫ్ట్ ప్రమాదాలు నివారించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన లిఫ్ట్, ఎస్కలేటర్ బిల్లును (Lift And Escalator Bill) ఆ రాష్ట్ర అసెంబ్లీ శనివారం ఆమోదించింది. ఇంధన శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడారు. నోయిడాలో ఒక లిఫ్ట్ ప్రమాద సంఘటన తర్వాత ఎమ్మెల్యేలు ధీరేంద్ర సింగ్, పంకజ్ సింగ్ దీని కోసం ఒక చట్టం చేయాలని కోరినట్లు చెప్పారు. దీంతో పబ్లిక్ ప్రదేశాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ బిల్లులో నిబంధన పెట్టినట్లు తెలిపారు.
కాగా, లిఫ్ట్ ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సమాచారం అందించడంతోపాటు బీమా, నష్ట పరిహారానికి సంబంధించిన నిబంధనలు కూడా ఈ బిల్లులో ఉన్నాయని మంత్రి అరవింద్ కుమార్ శర్మ తెలిపారు. బిల్లు చట్టంగా మారిన తర్వాత, ఇంధన శాఖ ఆమోదం పొందకుండా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. లిఫ్టులు, ఎస్కలేటర్లను తయారు చేసే సంస్థలు, ఇన్స్టాల్ చేసే, నిర్వహించే ఏజెన్సీలు డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని అన్నారు.
మరోవైపు రిజిస్ట్రేషన్ను ప్రతి ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుందని శర్మ తెలిపారు. ప్రతి ఏటా తనిఖీ కోసం రూ. 1,500 రుసుము డిపాజిట్ చేయాలని చెప్పారు. మరమ్మతులు చేయడంలో విఫలమైతే, ప్రమాణాలను విస్మరిస్తే యజమాని లేదా సంబంధిత సంస్థకు జరిమానా విధిస్తారని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, హర్యానాలో లిఫ్ట్లను ఏర్పాటు చేయడానికి సొంత చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు అలాంటి చట్టం లేకపోవడంతో ఈ బిల్లు తెచ్చినట్లు వెల్లడించారు.
కాగా, ఉత్తరప్రదేశ్ లిఫ్ట్, ఎస్కలేటర్ బిల్లు 2024తోపాటు ఉత్తరప్రదేశ్ లోకాయుక్త, లోకాయుక్త పదవీ కాలాన్ని ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించే యూపీ లోకాయుక్త (సవరణ) బిల్లు 2024ను కూడా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.