లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కాంగ్రెస్ క్యాంపెయిన్ ‘లడ్కి హు..లడ్ శక్తి హూ’ నినాదానికి పార్టీ పోస్టర్ గర్ల్గా పనిచేసిన మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ప్రియాంక మౌర్య బుధవారం బీజేపీ గూటికి చేరనున్నారు. యూపీ ఎన్నికల్లో పార్టీ టికెట్ను ఆశించి భంగపడిన ఆమె కాషాయ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ తన పేరు, ముఖం వాడుకోవడంతో పాటు తన 10 లక్షల మంది సోషల్ మీడియా ఫాలోవర్ల మద్దతును ప్రచారంలో వాడుకుని ఆపై తనకు ఎన్నికల్లో పార్టీ టికెట్ను నిరాకరించిందని ప్రియాంక మౌర్య మండిపడ్డారు. తనను పక్కనపెట్టి వేరొకరికి పార్టీ టికెట్ ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముందుగా తీసుకున్న నిర్ణయమని, తనకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు.
తాను ఓబీసీ యువతి అయినందునే తనకు టికెట్ రాలేదని ఆమె ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను మహిళలకు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లక్నోలో ప్రకటించారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు.