Lover Stabs | ఓ అమ్మాయి తన ప్రియుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ పెళ్లి ప్రస్తావన తేగానే ప్రియుడు కోపంతో ఊగిపోతున్నాడు. పెళ్లికి ఒత్తిడి చేస్తుందని చెప్పి, ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా 49 సార్లు పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్లో వెలుగు చూసింది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్కు చెందిన జగన్నాథ్ గోడా, కునిదార్ సీమదాస్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని కునిదార్.. జగన్నాథ్ను అడిగింది. సమయం పడుతుందని చెప్పాడు. కానీ కాలయాపన చేస్తున్నాడు. దీంతో మరోసారి ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. తీవ్ర ఒత్తిడికి గురైన జగన్నాథ్ ప్రియురాలిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.
ప్లాన్లో భాగంగా గుజరాత్లోని సూరత్ను చూసొద్దామని చెప్పి కునిదార్ను అక్కడకు తీసుకెళ్లాడు. సూరత్లోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. 49 సార్లు పొడిచి చంపాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత జగన్నాథ్ అక్కడ్నుంచి భువనేశ్వర్కు తిరిగొచ్చాడు.
కునిదార్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సూరత్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఒంటిపై ఉన్న టీ షర్ట్ దర్యాప్తులో కీలకమైంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో నమోదైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, వీరిద్దరు కనిపించారు. యువతి ధరించిన టీ షర్ట్, ఫుటేజీలో కనిపించిన టీ షర్ట్ ఒకేలా ఉండటంతో నిందితుడిని పట్టుకునేందుకు చాలా సులభమైంది. దీంతో భువనేశ్వర్లో జగన్నాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.