Sharad Pawar : నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దాంతో ఆయన భద్రతా సిబ్బంది గందేవీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు విచారణ చేపట్టారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తి మీద సెక్షన్ 294, ఐపీసీ 506(2) కింద కేసు నమోదు చేశారు. ముంబైలోని సిల్వర్ ఓక్లోని శరద్ పవార్ నివాసంలోని ల్యాండ్లైన్కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, ఆయనను చంపేస్తానని బెదిరించాడని ముంబై పోలీసులు మంగళవారం తెలిపారు. ఆయనను తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఫోన్ కాల్ చేసిన వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని, కొన్ని రోజులుగా అతను పలుమార్లు ఫోన్ చేసి శరద్ పవార్ను చంపుతానని బెదిరిస్తున్నాడని ఎన్సీపీ చీఫ్ అధికార ప్రతినిధి మహేష్ తపసె తెలిపాడు.
శరద్ పవార్ 82వ పుట్టినరోజు సోమవారం ఘనంగా జరిగింది. ఎన్సీపీ ప్రముఖులు, కాంగ్రెస్, శివసేన నాయకులు ఆయన నివాసానికి తరలివచ్చి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్డే చేసుకున్న మరునాడే చంపేస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఏడాదిలో రెండు సార్లు ఆయన ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. మార్చి, ఏప్రిల్ నెలలో మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు కొందరు శరద్ పవార్ ఇంటిపై దాడికి దిగారు. శరద్ పవార్ మహారాష్ట్రకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయ కురువృద్ధుడిగా పేరొందిన ఆయన మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో మహా వికాస్ అగాడీ ప్రభుత్వం ఏర్పాటు, ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.