హవేరీ: ఇంటర్లో 97 శాతం మార్కులు వచ్చినా తన కొడుక్కి ఇండియాలో మెడికల్ సీటు రాలేదని ఉక్రెయిన్పై రష్యా బాంబు దాడుల్లో మరణించిన కర్ణాటకకు చెందిన విద్యార్థి నవీన్ తండ్రి శేఖర గౌడ అన్నారు. మన దేశంలో డొనేషన్లు కోట్ల రూపాయల్లో ఉండటం కారణంగానే తన కొడుకు ఉక్రెయిన్కు వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు. చదువు కోసం విదేశాలకు వెళ్లిన బిడ్డ తిరిగి ఎప్పుడొస్తాడా? అని ఎదురుచూసే తాము.. ఇప్పుడు బిడ్డ చివరి చూపు కోసం చూస్తున్నట్టు పేర్కొన్నారు. తన బిడ్డ మృతదేహాన్ని ఉక్రెయిన్ నుంచి ఎప్పుడు తీసుకొస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అతన్ని చూడాలని ఉందంటూ బంధువులు, సన్నిహితుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. నవీన్ మృతదేహాన్ని తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కర్ణాటక సీఎం బొమ్మై బుధవారం చెప్పారు.
విదేశాల్లో మెడిసిన్ విద్య కోసం వెళ్లేవారిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో మెడిసిన్ చదివే 90% మంది మన దేశంలో జరిగే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక ఫెయిలైనవారే అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నవీన్ మృతిపై విచారణ జరుపుతామని రష్యా పేర్కొన్నది.