తిరువనంతపురం: పెళ్లికి పిలువలేదన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి వరుడి ఇంటిపై రాళ్లు విసిరాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో అతడు మరణించాడు. కేరళ (Kerala shocker) లోని కొట్టాయం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కరుకాచల్ ప్రాంతానికి చెందిన సెబాస్టియన్ అనే వ్యక్తికి ఇటీవల వివాహమైంది. అయితే తనను పెళ్లికి ఆహ్వానించకపోవడంపై పొరుగున నివసించే బిను అనే వ్యక్తి అవమానంగా భావించాడు. దీంతో వరుడి ఇంటిపై అతడు రాళ్లు విసిరాడు.
కాగా, ఈ సంఘటనపై వరుడు సెబాస్టియన్ ఆగ్రహం చెందాడు. గతంలో బినుతో గొడవ పడిన విషును కలిసి జరిగిన విషయం చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వారిద్దరూ కలిసి బినును నిలదీశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బినును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కొత్తగా పెళ్లైన సెబాస్టియన్, విషు కలిసి పోలీసులకు లొంగిపోయారు. బినుపై దాడి చేసిన ఆయుధాలను అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బిను హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.