ముంబై: దేశ వ్యాప్తంగా బీజేపీ స్థానాన్ని భర్తీ చేయాలని శివసేన యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్నది. శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే నాయకత్వంలో దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో పోరాడతామని మీడియాతో అన్నారు. దానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. తాము ఇప్పుడే
గోవా నుంచి తిరిగి వచ్చామన్నారు. త్వరలో ఆదిత్య ఠాక్రేతో కలిసి ఉత్తరప్రదేశ్ను సందర్శిస్తామని తెలిపారు. యూపీలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు.
కాగా, ఇప్పటి వరకు మహారాష్ట్రకే పరిమితమైన శివసేన తొలిసారి ఆ రాష్ట్రం వెలుపల ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఉత్తరప్రదేశ్లో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు మద్దతు ఇస్తున్నది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ కుమారుడు, ఉత్పల్ పారికర్కు శివసేన మద్దతు ఇస్తున్నది.
ఈ నేపథ్యంలో శనివారం గోవాకు వెళ్లిన ఆదిత్య ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ఉత్పల్ పారికర్కు స్వచ్ఛమైన మనస్సుతో మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆయనతో తమ మధ్య ఎలాంటి రహస్య సమావేశం జరుగలేదన్నారు. రాబోయే కాలంలో గోవాలో జరిగే అన్ని ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని తెలిపారు.
మరోవైపు ప్రస్తుత దేశ రాజకీయాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా శివసేన అవసరం ఉందని ఆదిత్య ఠాక్రే తెలిపారు. మహారాష్ట్రలోని సుపరిపాలన అన్ని రాష్ట్రాల్లో పునరావృతం కావాలని, ఇది తమ ఆకాంక్ష అని అన్నారు. అందుకే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీతో శ్రీకారం చుట్టామన్నారు.