లక్నో : మహా శివరాత్రి పర్వదినం రోజున ఉజ్జయినిలోని మహా కాళేశ్వరుడి ఆలయం దీపాల వెలుగుల్లో కాంతులీననున్నది. 21లక్షల దీపాలను వెలిగించి.. గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంతకు ముందు 11 నుంచి 15లక్షల దీపాలను వెలిగించాలని అనుకున్నా.. దీన్ని 21లక్షలకు పెంచారు. శివరాత్రి పర్వదినం రోజున శిప్రా నది ఒడ్డున మాతా మందిర్ ఘాట్ నుంచి రామ్ఘాట్ వరకు 12లక్షల ప్రమిదలు, మిగతా దివ్వెలను పలుచోట్ల వెలిగించనున్నారు. కాగా దీపాలను 12వేల మంది వలంటీర్లు అవసరం కాగా.. పంచాయతీ, విద్యాశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటీలకు ఈ బాధ్యలను అప్పగించారు.
కలెక్టర్ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. గతంలో 15లక్షల దీపాలను వెలిగించాలని అనుకున్నామని, ప్రస్తుతం లక్ష్యాన్ని మరింత పెంచామన్నారు. ఇదిలా ఉండగా.. దీపావళి సందర్భంగా అయోధ్యలో 12లక్షల దీపాలను వెలిగించిన విషయం తెలిసిందే. వివిధ ఘాట్ల వద్ద 12లక్షల దీపాలు, మహాకాల్ ఆలయంలో 51వేల దీపాలు, ఫ్రీగంజ్ టవర్పై లక్ష, మంగళనాథ్, చింతామన్, కాలభైర, భుఖిమాత, నగరంలో హర్సిద్ధి ఆలయాలతో సహా ఇతర ఆలయాల్లో కూడా దీపాలు వెలిగించనున్నారు. ఒక నగరంలో ఒకేసారి 21లక్షల దీపాలు వెలిగించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కార్యక్రమం నేపథ్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులను సైతం సంప్రదించారు.