దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తూ మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 2 నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించారు. ఇక మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఎవరైనా ధరిస్తే ఇబ్బంది వుండదని, తాము మాత్రం మాస్క్ కచ్చితమన్న నిబంధనను మాత్రం విధించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సీఎం ఉద్ధవ్ థాకరే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో విధించిన కోవిడ్ నిబంధనలన్నీ ఎత్తేస్తున్నాం. గుడి పాడ్వా (మహారాష్ట్ర నూతన సంవత్సరం) నుంచి అమలులో ఉంటాయి. అంటూ సీఎం ఉద్ధవ్ ట్వీట్ చేశారు.
ఇక ఇదే విషయంపై ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే కూడా మాట్లాడారు. ప్రస్తుతం 700 నుంచి 800 వరకూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, 4 శాతం పాజిటివిటీ రేటు ఉందన్నారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాల ఆధారంగా, అలాగే.. రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సూచించిన సూచనల మేరకు కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్నామని మంత్రి రాజేశ్ తోపే పేర్కొన్నారు.