ముంబై, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-21 స్థానాలు, కాంగ్రెస్-17, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరింది. సీట్ల పంపకంపై గతకొన్ని వారాలుగా జరుగుతున్న చర్చలు ఫలించినట్టు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం ప్రకటించారు.
బీజేపీకి రాజ్ఠాక్రే మద్దతు
మహారాష్ట్రలోని బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమికి ఈ ఎన్నికల్లో బేషరతు మద్దతు ఇస్తున్నట్టు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మంగళవారం ప్రకటించారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు, మోదీ లాంటి సమర్థ నాయకత్వం కోసం ఈ మద్దతు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. దాదర్ శివతీర్థలో గుడిపాడ్వా మేళాలో ఆయన ప్రసంగించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టేది లేనిదీ చెప్పని ఆయన మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది అక్టోబర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని ఆయన తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.