Amit Choudhary | మీరట్, డిసెంబర్ 10: చేయని నేరానికి రెండేండ్ల జైలు.. తలకిందులైన జీవితం.. చెల్లాచెదురైన కలలు.. అయినా కుంగిపోలేదు.. ఆశను వీడలేదు.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాడు.. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకున్నాడు.. తన కేసును తానే వాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు.. బెయిల్పై బయటకు వచ్చి పట్టుదలతో న్యాయవిద్యను అభ్యసించాడు.. కేసును వాదించి గెలిచాడు.. నిర్దోషిగా బయటకు వచ్చాడు.. ఇదీ ఉత్తరప్రదేశ్కు చెందిన అమిత్ చౌదరి స్ఫూర్తిగాథ.
అంధకారం అలుముకున్నా..
చేయని నేరానికి ఎవరైనా శిక్ష అనుభవించాల్సి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. చాలా మంది మానసికంగా కుంగిపోతారు. సాధారణ జీవితాన్ని గడపలేని స్థితికి చేరుకుంటారు. కానీ, అమిత్ చౌదరి ఇందుకు భిన్నం. 2011లో ఆయన 18 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు చేయని ఓ నేరంలో నిందితుడిగా ఇరుక్కున్నాడు. మీరట్లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యకు సంబంధించిన కేసులో నాటి ముఖ్యమంత్రి మాయావతి ఆదేశాల మేరకు భారత శిక్షా స్మృతి (ఐపీసీ)తోపాటు జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
అంతటితో ఆగకుండా ఆయనపై గ్యాంగ్స్టర్ ముద్ర కూడా వేయడంతో జైలులో రెండేండ్లు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. దీంతో అమిత్ చౌదరి జీవితంలో అంధకారం అలుముకున్నది. అయినప్పటికీ ఆయనేమీ కుంగిపోలేదు. న్యాయ విద్యను అభ్యసించడం ద్వారా తన కేసును తానే వాదించుకుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. రైతు బిడ్డ అయిన అమిత్ చౌదరిని ముజఫర్నగర్ జైలులో కరుడు గట్టిన గ్యాంగ్స్టర్లు ఎన్ని ప్రలోభాలు పెట్టారు. తమ గ్యాంగ్లలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన లొంగలేదు. ఈ విషయంలో జైలర్ తనకు ఎంతో సహకరించారని, గ్యాంగ్స్టర్లు ఉన్న బ్యారక్ నుంచి తనను వేరే బ్యారక్కు మార్చారని అమిత్ చౌదరి తెలిపారు.
బెయిల్పై విడుదలై..
2013లో బెయిల్పై విడుదలైన అమిత్ చౌదరి తనపై పడిన అపనిందను తొలగించుకునేందుకు న్యాయ విద్యను అభ్యసించడంలో నిమగ్నమై బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేయడంతోపాటు విద్యలో పలు మైలురాళ్లను అధిగమించాడు. తద్వారా న్యాయపరమైన అంశాల్లో పట్టు సాధించి లాయర్గా తన కేసును తానే వాదించుకున్నాడు. ఈ కేసులో అమిత్ చౌదరిపై మోపిన అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమవడంతో ఆయనతో సహా 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో అసలు నేరస్థులైన ముగ్గురిలో సుమిత్ కైల్ అనే వ్యక్తి 2013లో ఓ ఎన్కౌంటర్లో మరణించగా.. నీతూ అనే మరో వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో నేరస్థుడు ధర్మేంద్ర ఇటీవల క్యాన్సర్తో మృతి చెందాడు. కాగా, ఈ కేసు వల్ల సైనిక దళంలో చేరాలన్న అమిత్ చౌదరి కలలు చెల్లాచెదురైపోయాయి. అయినప్పటికీ తన మాదిరిగా అపనిందల పాలైనవారికి అండగా నిలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకోసం క్రిమినల్ జస్టిస్లో పీహెచ్డీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.