పనాజీ: గోవాలో రష్యా దేశానికి చెందిన ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గురువారం అలెగ్జాండ్రా డ్జావీ (24) అనే రష్యా మహిళ తన అద్దె ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించగా, శుక్రవారం అదే దేశానికి చెందిన మరో మహిళ ఎకాటెర్నియా టిటోవా (34) ఓ అపార్టుమెంట్లోని తన అద్దె ప్లాట్ బెడ్రూమ్లో విగతజీవిగా పడివున్నది. వరుసగా రెండు రోజులు రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రష్యన్ మహిళలు అనుమానాస్పదంగా మరణించడం గోవాలో కలకలం రేపింది.
ఈ రెండు ఘటనలు కూడా నార్త్ గోవాలోని సియోలిమ్ గ్రామంలో చోటుచేసుకున్నాయి. కాగా ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరి మరణాలకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే దర్యాప్తులో పురోగతి కనిపించే అవకాశం ఉందని చెప్పారు. అయితే, అలెగ్జాండ్రా డ్జావీ కొందరు తనను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 2019లో చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఆ కేసుకు, ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.