Arrest: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరూ నజత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోకిర్ టోకియా ప్రాంతానికి చెందిన మెహబూబ్ మొల్లాహ్, సుకామల్ సర్దార్గా గుర్తించారు. ఈడీ టీమ్పై జరిగిన దాడిలో ఈ ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 5న పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈడీ బృందంపై మూకదాడి జరిగింది. వందల మంది ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులకు గాయాలయ్యాయి. వారి నుంచి దుండగులు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, మనీ పర్సులు లాక్కెళ్లారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేషన్ సరఫరా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ ఇంట్లో ఈడీ సోదాలకు వెళ్లిన సమయంలో ఆయన మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ కూడా తీవ్రంగా ఖండించారు.