న్యూఢిల్లీ: వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ( Anand Mahindra ) తన ట్వీట్లతో ఆసక్తికర విషయాలు చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా చేసిన ఓ ట్వీట్ అమెరికాలో డబ్బవాలాల గురించి తెలియచేస్తోంది. న్యూయార్క్ వీధుల్లో స్టీల్ డబ్బాతో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి ఫోటోను ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్లో పోస్టు చేశారు. డబ్బావాలీ అంటూ ఆ ఫోటోకు ట్యాగ్ చేశారు. దీంతో నెటిజన్లు కుప్పలుతెప్పలుగా రియాక్ట్ అయ్యారు. ముంబైలో డబ్బావాలాలు ఉన్నట్లే.. అమెరికాలో డబ్బావాలీలు ఉన్నట్లు కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా ఉద్యోగానికి వెళ్లే భారతీయులు మధ్యాహ్నం భోజనం కోసం స్టీల్ టిఫిన్ బాక్సులను తీసుకువెళ్లే విషయం తెలిసిందే. అయితే అమెరికా డబ్బావాలీ అంటూ ట్వీట్ చేసిన ఫోటోకు 1400 లైక్లు వచ్చాయి. 550 సార్లు ఆ ఫోటో షేర్ అయ్యింది.
ఆనంద్ ట్వీట్ను రీపోస్ట్ చేస్తూ.. నెదర్లాండ్స్కు చెందిన ఓ భారతీయ సంతతి మహిళ తన డబ్బా స్టోరీ చెప్పేసింది. డబ్బావాలాలు దేశానికి గర్వకారణమని మరో యూజర్ కామెంట్ చేశారు. ముంబైలో డబ్బావాలాలు వంద శాతం పర్ఫెక్ట్గా ఉంటారని, అలాంటప్పుడు న్యూయార్క్లో ఎందుకు ఉండకూడదన్నారు. స్టీల్ డబ్బాలు ఇండియన్లకు ఓ ఎమోషన్ లాంటివని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.