చెన్నై: తమిళనాడులోని అధికార టీవీకేకు చెందిన నేర చరిత్ర ఉన్న ఒక సభ్యుడ్ని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. పాత కక్షలు, ప్రతీకారం వల్ల ప్రత్యర్థులు ఆయనను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. (TVK Member Stabbed To Death) చెన్నైలో కార్ల అద్దె వ్యాపారం చేసే కణ్ణన్ టీవీకే సభ్యుడు. గతంలో పలు హత్యా కేసులు నమోదైన ఆయన నేర చరిత్ర ఉన్న వ్యక్తిగా పోలీసుల నిఘాలో ఉన్నారు. అయితే సెప్టెంబర్ 5న చెన్నైలో కణ్ణన్ తన స్నేహితులతో కలిసి ఉండగా బైక్లపై వచ్చిన కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి ఆయనను హత్య చేశారు.
కాగా, శాస్త్రి నగర్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐదుగురు నిందితులైన బరణి, రాకేష్, నరేష్, మణికందన్, హరిహరన్ను అరెస్ట్ చేశారు. 2009లో బరణి చిన్నాన్న శివను, కణ్ణన్ ఆయన అనుచరులు హత్య చేసినట్లు విచారణలో తేలింది. అలాగే 2014లో బరణి తండ్రి వేలు కూడా హత్యకు గురయ్యాడు. ఆ హత్యలకు ప్రతీకారంగానే కణ్ణన్ను వారు చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు అధికార టీవీకే సభ్యుడు కణ్ణన్పై దాడిని అరికట్టడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టారు. డీజీపీ ఆదేశాల మేరకు అడయార్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయన్, శాస్త్రి నగర్ ఇన్స్పెక్టర్ రోహిణిలను రిజర్వ్కు బదిలీ చేశారు.
అయితే ప్రతిపక్ష నాయకుడైన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, టీవీకే ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ఆయన ప్రశ్నించారు. పోలీస్శాఖ గ్రాంట్లపై జరిగే చర్చకు సీఎం విజయ్ స్పందించక ముందే, ఆయన పార్టీ నాయకుల్లో ఒకరు రాజధానిలో హత్యకు గురయ్యారని ఆరోపించారు. ‘ప్రాణరక్షణ కోసం అధికార టీవీకేలో చేరిన ఒక రౌడీ షీటర్ పారిపోతుండగా వెంబడించి నడిరోడ్డుపై హత్య చేశారు. తమిళనాడులో ‘విజయోత్సాహంతో కూడిన శాంతిభద్రతల’ పరిస్థితి ఇదే!’ అని ఎక్స్ పోస్ట్లో ఆయన ఎద్దేవా చేశారు.