ముంబై: టీవీ నటుడు, మోడల్ ఆదిత్యసింగ్ రాజ్పుత్ ఇవాళ మధ్యాహ్నం అనుమానాస్పద స్థితితో మృతిచెందాడు. తన ఇంటి బాత్రూమ్లోనే అతను విగతజీవిగా పడివున్నాడు. కదలిక లేకుండా పడివున్న ఆదిత్యసింగ్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదిత్యసింగ్ రాజ్పుత్ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆదిత్యసింగ్ను కలిసేందుకు అతని స్నేహితుడు వెళ్లగా సింగ్ బాత్రూమ్లో ఎలాంటి కదలిక లేకుండా పడివున్నాడు. దాంతో ఇంటి వాచ్మాన్ సాయంతో స్నేహితుడు ఆదిత్యసింగ్ను ఆస్పత్రికి తరలించాడు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అతని మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందన్నారు. ఆదిత్యసింగ్ డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్ల మరణించాడా.. లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఆదిత్యసింగ్ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో, వాణిజ్య ప్రకటనల్లో అతను నటించాడు. ఎంటీవీ ప్రసారం చేసే స్ప్లిట్స్ విల్లా 9 సీజన్ అతనికి బాగా పేరు తెచ్చింది.
కాగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆదిత్య సింగ్ ఐదు రోజుల క్రితం కూడా ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్టుకు హ్యాప్పినెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు..? అంటూ ఇంగ్లిష్లో క్యాప్షన్ ఇచ్చాడు. అమ్మ చేతి ముద్ద, అలసిపోయి రాగానే దొరికే ప్రేమ, నచ్చిన స్నేహితుడితో గడిపే సమయం, పెంచుకున్న కుక్కతో ఆటలో హ్యాప్పినెస్ ఉంటుందని, ఇప్పుడు డబ్బు కూడా ఈ జాబితాలో చేరిందని పేర్కొన్నాడు. డబ్బు ముఖ్యమేగానీ డబ్బులోనే హ్యాప్పీనెస్ ఉండదని రాస్తూ.. నాతో మీరు ఏకభవిస్తున్నారా.. అని ప్రశ్నించాడు. ఇంతలోనే అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.