ముంబై, ఆగస్టు 9: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ బుధవారం ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్విట్ ఇండియా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరంలోని ఆగస్టు క్రాంతి మైదాన్కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని నిర్బంధించారని తుషార్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి పోలీసులు తనను నిర్బంధించారని ట్వీట్ చేశారు. ‘బాపూజీ కూడా ఇదే చారిత్రాత్మక రోజున బ్రిటిష్ పాలకుల చేతిలో అరెస్టయ్యారు. నేను కూడా ఇదే తేదీన పోలీసుల అదుపులో ఉన్నా. ఇందుకు గర్విస్తున్నా. పోలీసుల నిర్బంధం నుంచి విడుదలయ్యాక క్రాంతిమైదానంలో జరిగే ర్యాలీకి హాజరవుతా’ అని ఆయన పేర్కొన్నారు. క్రాంతి మైదాన్కు వెళ్లేందుకు పోలీసులు అనుమతించిన తర్వాత తాను ఓ ముస్లిం ట్యాక్సీ డ్రైవర్ను అడుగ్గా.. అతను పోలీసు వాహనాన్ని చూసి భయపడ్డాడని, ‘సారు నాకు ఇబ్బందేం లేదు కదా, ఇరికించరు కదా!’ అని ఆందోళన వ్యక్తం చేశాడని తెలిపారు. ‘అతన్ని ఒప్పించేందుకు భరోసా ఇవ్వాల్సి వచ్చింది. ఈ రోజున మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి ఇది(భయం)’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ద్వేషించే వారు భారతదేశాన్ని వదలండి, హృదయాలను ప్రేమతో కలపడం చాలా అవసరం’ అని ట్వీట్లో తుషార్ గాంధీ అన్నారు. ఆగస్టు క్రాంతి మైదాన్కు వెళ్లేందుకు తమను కూడా అనుమతించలేదని, పోలీసులు బయటకు రానివ్వలేదని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జీజీ పారిక్, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ పేర్కొన్నారు. కాగా, గిర్గావ్ చౌపట్టి నుంచి క్రాంతి మైదాన్కు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని, ఆ తర్వాత క్రాంతి మైదాన్లో నివాళులు అర్పించేందుకు తుషార్ గాంధీని అనుమతించామని పోలీసులు పేర్కొన్నారు.